ప్రగతిభవన్ పై సర్జికల్ స్ట్రైక్
గ్రేటర్ ఫలితాలు నిస్సందేహంగా సర్జికల్ స్ట్రైకే... కాకపొతే బండి సంజయ్ చెప్పినట్లు
ఇది పాతబస్తీపై జరగలేదు. ప్రగతిభవన్ పై జరిగిన స్ట్రైక్ ఇది.. అయితే ఇంత జరిగినా తెరాస
నేతల ఆలోచనల్లో మార్పు వచ్చినట్లు కానరావడం లేదు. ఓటమి విశ్లేషణలో మూసధోరణిలోనే మాట్లాడుతున్నారు.
బిజెపి మతపరమైన భావోద్వేగాల ఆధారంగానే గెలిచిందని వాదిస్తున్నారు. కాదని నేను అంటాను.
బిజెపికి మతం ఒక ప్లస్ పాయింట్ అయితే అయ్యి ఉండవచ్చు. అంతేగానీ అది ఒకటే కారణమని చెప్పడం
సరికాదు. ఖచ్చితంగా తెరాస వైఫల్యాలే ఇందుకు కారణం. ఒకవేళ మతమే కారణం ఐతే బిజెపికి ఖచ్చితంగా
వంద సీట్లు గెలిచి ఉండేది.అలా జరగలేదే. హిందూవులంతా మతావేశంతో ఊగిపోలేదే.. మతం బిజెపికి
ఒక అదనపు బలంగానే ఉపయోగపడి ఉండవచ్చు. కానీ మతం పేరుమీదే గెలిచిందని అనలేము. ఎందుకంటే
ప్రజలు ఎక్కడ నిర్లక్ష్యనికి గురయ్యారో బిజెపి అక్కడ మెరుగైన ఫలితాలు సాధించింది. ముఖ్యంగా
వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో బిజెపి దూసుకుపోయింది. దీనర్ధం ఏమిటి. అక్కడ ప్రభుత్వ
వ్యతిరేకత ఉందనేగా.. గ్రేటర్ అంతటా బిజెపి గెలిచిందా లేదే.. కొన్ని చోట్ల గెలిచినా
అది వన్ సైడ్ గా అంటే ఏకపక్ష మెజారిటీ సాధించలేదే. మతమే ప్రభావితం చేసి ఉంటే తెరాసకు
ఇన్ని సీట్లు వచ్చి ఉండేవా.. ఇంకా ఈ మతం ముసుగుతో వైఫల్యాలను కప్పి పూచుకోవడం ఎందుకు.
Trs ఒంటెద్దు పోకడలు, సర్వం మేమే అన్న అహంకారం, ప్రజాసమస్యలను సకాలంలో గుర్తించకుండా
తెలంగాణా సెంటిమెంట్ నే నమ్ముకోవడం వంటి కారణాలతో ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. కాంగ్రెస్
ను నామరూపాల్లేకుండా చేయడం కూడా బీజేపీకి కలిసి వచ్చింది. ఖచ్చితంగా ఇది తెరాస వైఫల్యమే. ఇవే్మీ ఆలోచించకుండా బీజేపీ మతం కార్డుతోనే
గెలిచిందని ఇంకా వాదించడం తెరాసకే చెల్లింది. ఒకటి నిజం గ్రేటర్ ప్రజలు మొత్తంగా మతం
వెంట పరుగులు తీయలేదు. మజ్లీస్ డివిజన్లకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో కొంత ప్రభావం కనిపించిన
మాట నిజమే. గత ఎన్నికల్లోనూ బిజెపి మతం అనే కార్డును ప్రయోగించింది మరి అప్పుడు ఎందుకు
గెలవలేదు. ఎవరు ఎన్ని కార్డులు ప్రయోగించిన్నా గ్రేటర్ ప్రజలు ఎవరిని ఎక్కడ పెట్టాలో
అక్కడే పెట్టారు. తెరాస నేతలు తమ ధోరణి మార్చుకోకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్ పక్కన
చేరినా ఆశ్చర్యం లేదు.
చక్కని విశ్లేషణ.
ReplyDeleteధన్యవాదములు సర్..🙏
Delete